నందిగామ: నందిగామ మండలం అయ్యప్పటెంపుల్ పాత జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం జంగోనిగూడ గ్రామానికి చెందిన శ్రీధర్(55), పఠాన్ చెరువు మున్సిపాలిటీకి చెందిన సురేష్ కుమార్(30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీరిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీళ్లు అయ్యప్పటెంపుల్ సమీపంలోకి వచ్చేసరికి.. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకు ఢీకొని, ఆ పక్కనే బైకుపై ఉన్న శ్రీధర్, సురేష్ కుమార్లను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు శ్రీధర్కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సురేష్కు ఇంకా వివాహం కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను షాద్ నగర్ కమ్యూనిటీ దవాఖానకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సిఐ రామయ్య తెలిపారు.