బంజారాహిల్స్ : మద్యం మానేసిన తర్వాత మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన కోడిపుంజుల శ్రీనివాస్ (35) అక్కడే ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసేవాడు. అతడికి ఐదేండ్ల క్రితం జవహర్నగర్కు చెందిన సురేఖతో పెండ్లయింది. వారికి 15నెలల వయస్సుగల పాప ఉంది.
గత కొన్నినెలలుగా మద్యానికి బానిసగా మారిన శ్రీనివాస్ భార్యను వేధిస్తుండేవాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పద్దతి మార్చుకుంటానని చెప్పిన శ్రీనివాస్ మద్యం మానేశాడు. అయితే మద్యం మానేసిన తర్వాత శ్రీనివాస్ మానసిక పరిస్థితిలో తేడాలు వచ్చాయి. దాంతో కొన్నాళ్లపాటు బావమరిది ఇంట్లో ఉంటే పరిస్థితి బాగుపడుతుందనే నమ్మకంతో ఈ నెల 11న జవహర్నగర్కు తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఈనెల 13న తాను ఊరికి వెళ్తానంటూ చెప్పడంతో కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటే మంచిదని కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో మనస్థాపానికి గురయిన శ్రీనివాస్ కూరగాయల కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు బావమరిది వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.