Tungabhadra | అలంపూర్ : దైవ సన్నిధికి బయల్దేరిన యువకుడు నదిని దాటే క్రమంలో నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwal ) జిల్లా అలంపూర్( Alampur ) ఆలయ సమీపంలో చోటు చేసుకున్నది.
ఎస్ఐ మహేందర్ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా( Narayanpet Dist ) మక్తల్ మండలం సంగంబండ ప్రాంతానికి చెందిన సిద్ధిరామ్ (20) శ్రీశైలం( Srisailam ) క్షేత్రానికి పాదయాత్ర చేపట్టాడు. సిద్ధిరామ్తో పాటు అతని ముగ్గురు మిత్రులు శ్రీకాంత్, తిమ్మారెడ్డి, మహేశ్ కూడా కాలినడక కొనసాగించారు.
అయితే బుధవారం ఉదయం అలంపూర్ క్షేత్రం వద్ద తుంగభద్రలో ఈదుకుంటూ నదిని దాటాలన్న సరదాతో నలుగురు కలిసి బయల్దేరారు. ముగ్గురు క్షేమంగా నదిని దాటగా, సిద్ధిరామ్ ఈదలేక నీటిలో మునిగిపోయాడు. గమనించిన జాలర్లు, మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందించగా వారు నది వద్దకు చేరుకొని జాలర్లు, ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.