హనుమకొండ : తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. చదువు రీత్యా అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సమీపంలోని గాంధీ నగర్లో నివాసముంటున్నారు. అయితే తనను ప్రేమించాలని అజహర్ అనే యువకుడు.. అనూషను గత కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. అనూషనేమో అజహర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గాంధీ నగర్ చేరుకున్న అజహర్.. ఇంట్లో అనూష ఒక్కరే ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన అజహర్.. తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అనూష గొంతును కోసి పరారీ అయ్యాడు.
అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అనూషను చూసి షాక్కు గురైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనూషకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అజహర్ను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.