మెదక్ : భర్తతో పాటు అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
దొంతి దివ్య(24) అనే మహిళను తన భర్త నిత్య వేధింపులకు గురి చేస్తున్నాడు. అత్తమామలు కూడా ఆమెను మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భర్తతో దివ్యకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పురుగుల మందు తాగింది. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది.
దివ్య తల్లిదండ్రులు, బంధులు కలిసి తుప్రాన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతికి కారణమైన ఆమె భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యకు ఓ కూతురు ఉంది. వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.