Hyderabad | హైదరాబాద్ : హయత్నగర్లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. తొర్రూరులో ఓ వృద్ధురాలిని హత్య చేశారు. ఆమెపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్కు చెందిన సత్తమ్మ(78)తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఓ ఫంక్షన్ నిమిత్తం బయటకు వెళ్లారు. అయితే ఫంక్షన్ ముగిసిన తర్వాత సత్తమ్మ ఒక్కతే ఇంటికి చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున సత్తమ్మ ఇల్లు తెరవకపోయేసరికి.. పక్కింట్లో ఉన్న వారు.. తలుపులు తెరిచి చూశారు. విగతజీవిగా పడి ఉన్న సత్తమ్మను చూసి షాక్ అయ్యారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ దర్యాప్తు చేపట్టారు. సత్తమ్మను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తుర్కయాంజాల్ రైతు సహకార సంఘం మాజీ ఛైర్మన్ సంరెడ్డి బాల్ రెడ్డి తల్లే సత్తమ్మ. సత్తమ్మను బంగారం కోసమే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.