Warangal | నెక్కొండ : తోటి కోడళ్లు గొడవ పడటం సహజమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తిట్ల పురాణం అందుకుంటారు. అంతటితో ఆగకుండా సిగ పట్లు కూడా పడుతారు. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని విడిపిస్తారు. ఆ మాదిరిగానే ఓ ఇద్దరు తోటి కోడళ్లు.. గొడవపడి కర్రలతో బాదుకున్నారు. దీంతో ఒక కోడలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాకలో చోటు చేసుకుంది.
నెక్కొండ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ తోట మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… పత్తిపాక గ్రామానికి చెందిన తాళ్ల లచ్చమ్మ, తాళ్ల కళమ్మ(70) తోటి కోడళ్లు. తరచూ చిన్న చిన్నవిషయాలకే గొడవ పడేవారు. శనివారం ఇద్దరి మధ్య తిట్ల పంచాయతీ పెరగగా తాళ్ల లచ్చమ్మ తన చేతికర్రతో కళ్లమ్మ తలపై కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో లచ్చమ్మను నెక్కొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణం విడిచింది. మృతురాలి కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.