వనపర్తి : ఓ ఏడేండ్ల కుమారుడితో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్థుల కథనం ప్రకారం… గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మంగలి శశికళ(30) పెబ్బేరు మండలం శాగాపూర్ గ్రామ వాసి చందుతో 17 ఏండ్ల కింద వివాహం జరిగింది. భార్యభర్తల తగాదాతో గత పది సంవత్సరాల నుంచి గోవర్ధనగిరి గ్రామంలో ఉంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తుంది.
గత రెండు వారాల కింద భర్త గోవర్దనగిరి గ్రామానికి వచ్చాడు. దీంతో శశికళ తన కుమారుడు అఖిల్(7)ను తీసుకొని గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామ సమీపంలోని ఓ బావిలో తల్లీకుమారుడి మృతదేహాలు శుక్రవారం ఉదయం తేలియాడాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.