నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మక్లూరు మండలం రామచంద్రపల్లి వద్ద ఓ వ్యక్తిని చెట్టుకు ఉరేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దింట్ల పోశెట్టి(47) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఫోన్ చేయగా, ఆర్మూర్ వెళ్లాను.. సాయంత్రం వరకు వస్తానని కుటుంబ సభ్యులకు పోశెట్టి తెలిపాడు.
అయితే ఇవాళ ఉదయం రామచంద్రపల్లి శివారులో పోశెట్టి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, భార్య సరోజకు సమాచారం అందించారు. పోశెట్టిని చెట్టుకు ఉరేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో పోశెట్టి హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.