6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ
నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు
ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం సీఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. నాచారం స్నేహపురికాలనీ శ్రీనిధి అపార్టుమెంట్లో నివాసముండే హేమవతికి కేర్టేకర్గా మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన పెరిక భార్గవి(32) ఉంటుంది. లండన్లో నివాసముంటున్న శశిధర్ ఆగస్టు నెలలో తల్లి హేమవతికి కేర్టేకర్గా ఉంటుందని రూ.15 వేల జీతంతోపాటు ఇంట్లో నివాసముండే విధంగా భార్గవిని నియమించారు.
భార్గవి తన కుమార్తె(7)తో కలిసి ఇక్కడే ఉంటుంది. ఇంట్లో పనులు చేస్తున్న భార్గవి అల్మారాలో ఉన్న బంగారం, నగదు విలువైన వస్తువులు చోరీ చేయాలనే ఉద్దేశంతో పథకం వేసింది. హేమవతి కంట్లో నీరు కారుతుండటంతో ఐడ్రాప్స్కు బదులుగా హార్పిక్ ద్రావణంలో జండూబామ్, నీరు కలిపి కండ్లలో వేసింది. రోజూ ఇలాగే చేయడంతో హేమవతి కండ్లు కనిపించకుండ పోయాయి. కండ్లలో ఇన్ఫెక్షన్ సోకిందని, హేమవతి కుమారుడికి సమాచారం ఇచ్చింది. హేమవతిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించమని చెప్పడంతో హబ్సిగూడలోని ఆసుపత్రిలో చికిత్స చేయించింది. ఇదే అదనుగా భావించి బీరువాలో ఉన్న ఆరున్నర తులాల బంగారం, రూ.40 వేల నగదును భార్గవి చోరీ చేసింది. నగదును ఖర్చుచేసి, నగలు మాత్రం తన బ్యాగులో పెట్టుకుంది.
కంటి చికిత్సలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో హేమవతి కుమార్తె ఉషశ్రీ వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించింది. కంటి సమస్య తగ్గకపోవడంతో శశిధర్ వచ్చి, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు పరీక్షించి, కంటిలో విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న శశిధర్, ఉషశ్రీలు భార్గవిపై అనుమానంతో బీరువాను పరిశీలించగా నగలు కనిపించలేదు. భార్గవిని నిలదీయగా అనుమానిస్తున్నారని చెప్పి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. నగలు దాచిన బ్యాగును తీసుకుని వెళ్లాలని మరల నాచారం రావడంతో అనుమానంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. దీంతో భార్గవి బ్యాగులో నగలు లభించాయి. హేమవతి కుమార్తె ఉషశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు భార్గవిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.