నల్లగొండ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడు కారు డ్రైవింగ్ చేస్తూ.. ర్యాష్గా నడిపాడు. దీంతో కారు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లగా, ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చండూర్ మండలం గట్టుప్పల్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చండూరు మండలం గట్టుప్పల్ గ్రామానికి చెందిన మల్లేష్ వివాహం యదాద్రి జిల్లా నారాయణపురంలో జరిగింది. పెళ్లి వేడుక ముగించుకొని స్వగ్రామం గట్టుప్పల్ కి వధూవరులు రాత్రి సమయంలో కారులో వచ్చారు. ఈ సందర్భంగా డీజే పాటలతో బరాత్ ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు ఇంటికి కొద్ది దూరంలో బంధువులు, స్నేహితులు జోరుగా డ్యాన్స్ చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ దిగి పక్కకు వెళ్లగా.. వరుడు డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపే ప్రయత్నం చేశాడు. అతనికి డ్రైవింగ్ రాకపోవడంతో.. అదుపుతప్పి అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుబ్బాకకు చెందిన సాయి చరణ్(13) అనే బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పెళ్లి కొడుకుతో సహా మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
వీడియో : నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామంలో నిర్వహించిన పెళ్లి వేడుక బరాత్లో వరుడి ర్యాష్ డ్రైవింగ్.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు.. pic.twitter.com/YY3yasONMn
— Namasthe Telangana (@ntdailyonline) May 27, 2022