Stray Dogs | హనుమకొండ : ఓ ఆరు వీధి కుక్కలు కలిసి బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన సునీత, మల్కన్ దంపతులు సంచార జీవనం చేస్తూ బతుకుతున్నారు. అయితే అజ్మీర్ వెళ్లేందుకు కాజీపేట రైల్వేస్టేషన్కు నిన్న రాత్రి వచ్చారు. అయితే ఇవాళ ఉదయం స్టేషన్ సమీపంలో ఉన్న పార్కు వద్ద ఆహారం వండుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక వారి కుమారుడు ఛోటూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలో ఉన్న చెట్లలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ ఆరు కుక్కలు బాలుడిపై పదిహేను నిమిషాల పాటు విచక్షణారహితంగా దాడి చేశాయి. కేకలు వేసినప్పటికీ ఆ అరుపులు ఎవరికీ వినిపించలేదు. బాలుడి షర్ట్ కంప చెట్లకు చిక్కుకోవడంతో అక్కడ్నుంచి రాలేకపోయాడు.
ఛోటూ ఇంకా రావడం లేదని తల్లిదండ్రులు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే క్వార్టర్స్తో పాటు ఆ పరిసరాల్లో వీధి కుక్కలు ఉన్నాయని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. నాలుగు రోజుల క్రితం ఓ బాలికపై, 15 రోజుల క్రితం రైల్వే ఉద్యోగిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు గుర్తు చేశారు.