లక్నో: ఆయిల్ ట్యాంకర్, ఒక వాహనం ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బాలురతో సహా ఆరుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. హరౌని-మోహన్ రోడ్లో డీజే పరికరాలతోపాటు 12 మంది ప్రయాణిస్తున్న మినీ ట్రక్ను ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలోని ఆరుగురు చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులను శైలేంద్ర (35), రామధర్ (15), పురుషోత్తం (23), జైకరణ్ (16), సభంబర్ (13), రాహుల్ (13)గా గుర్తించారు. గాయపడిన వారిని ట్రామా సెంటర్లో చేర్పించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి ఠాకూర్ తెలిపారు. మృతులు, గాయపడిన వారంతా హర్దోయ్ జిల్లా వాసులని చెప్పారు.
కాగా, ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఈ ప్రమాదానికి పాల్పడ్డాడని, ఎదురుగా వస్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయి దానిని వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అనంతరం ఆయిల్ ట్యాంకర్ను వీడి పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.