న్యూఢిల్లీ: ఒక మహిళను బిల్డింగ్ బాల్కానీ పైనుంచి ఆమె అత్తమామలు తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మయూర్ విహార్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ టెర్రస్ పై నుంచి 30 ఏళ్ల మహిళ కింద ఉన్న రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
కాగా, తన సోదరిని అత్తింటి వారు బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసివేశారని ఆమె సోదరుడు ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్కు కూడా ఈ వీడియోను పంపాడు. ఆ సంస్థ అధికారిణి స్వాతి మలివాల్ దీనిపై స్పందించారు. ఈ దారుణంపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు.
మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రియాంక కశ్యప్ తెలిపారు. బాధిత మహిళ అత్తింటివారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.