Rangareddy | రంగారెడ్డి : నార్సింగిలో నిన్న రాత్రి ఓ ముగ్గురు యువకులు అరాచకం సృష్టించారు. పెట్రోల్ బంక్( Petrol Bunk ) సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువకుల దాడిలో పెట్రోల్ బంక్కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.
కారులో పెట్రోల్ పోయించుకుని, పేమెంట్ కోసం యువకులు కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం లేదు.. డబ్బు ఇవ్వాలని సిబ్బంది అడగడంతో.. యువకులు రెచ్చిపోయారు. బంక్లో ఉన్న ఇద్దరు కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో సంజయ్ అనే కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. యువకుల దాడిలో సంజయ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఆ ముగ్గురిని జన్వాడకు చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్గా పోలీసులు గుర్తించారు.
కొట్టిన వెంటనే కుప్పకూలిన సంజయ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సంజయ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సంజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం పనిచేస్తూ జీవనం సాగించే తమ కొడుకు మరణించడంతో సంజయ్ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. సంజయ్ మరణానికి కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలంటూ మృతుడి తరపు బందువులు ఆందోళనకు దిగారు.