మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో 440 కిలోల గంజాయి పొడిని సోమవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
గంజాయి రవాణా, విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టాటా డీసీఎం వ్యాన్, టయోటా ఎటియోస్ కారులో 27 ప్లాస్టిక్ డబ్బాల్లో గంజాయి పొడి ప్యాకెట్లను తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ప్యాకెట్ దాదాపు రెండు కిలోల బరువుంటుందని, మొత్తం 216 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గంజాయి పొడి బరువు దాదాపు 440 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ. కోటి అని వెల్లడించారు.
గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పేరపురెడ్డి అర్జున్, నేరెళ్ల కిరణ్కుమార్, సయ్యద్ తాహెర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పేరపురెడ్డి రాజ్ వీరేంద్రకుమార్, సందీప్, తేజ, ఫజల్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి ఈ గంజాయి లోడ్ను తీసుకొచ్చారని తెలిపారు. ఈ దాడిలో రంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ డేవి రవికాంత్, మల్కాజ్గిరి డీపీఈవో డీ అరుణ్కుమార్, మల్కాజ్గిరి ఏపీ అండ్ ఈఎస్ బీ ముకుందరెడ్డి, ఉప్పల్ పీ అండ్ ఈఎస్ఐ ఎస్హెచ్వో ఎస్.చంద్రశేఖర్గౌడ్, ఉప్పల్ పీ అండ్ ఈఎస్ఐ ఎస్హెచ్వో ఎల్. మహేశ్వర్రెడ్డి, పీ అండ్ ఈఎస్ఐ ఎస్హెచ్వో ఎండీ అబ్దుల్ జబ్బార్, ఎస్హెచ్వో ఉప్పల్ సిబ్బంది పాల్గొన్నారు.