హైదరాబాద్ : ఓ యువకుడికి పెళ్లి కావట్లేదని తల్లి, సోదరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్ని సంబంధాలు చూసినా అన్ని విఫలం అవుతుండటంతో.. చేసేదేమీ లేక తనువు చాలించాలనుకున్నారు. దీంతో 18 నెలల పసిబాబు గొంతు నులిమి, తల్లీబిడ్డ ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది.
వినాయక నగర్కు చెందిన లలిత(56) అనే మహిళకు కూతురు దివ్య(32), కుమారుడు శ్రీకర్ ఉన్నారు. దివ్యకు పెళ్లి కాగా 18 నెలల కుమారుడు శివ కార్తీకేయ ఉన్నాడు. ఇక శ్రీకర్కు వివాహం కాలేదు. దీంతో అతనికి అనేక పెళ్లి సంబంధాలు చూశారు. కానీ ఏ ఒక్కటి కూడా సెట్ కావడం లేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై లలిత, దివ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక బుధవారం రాత్రి లలిత, దివ్య కలిసి శివకార్తీకేయను గొంతు నులిమి చంపారు. అనంతరం వారిద్దరూ ఫ్యాన్కు ఉరేసుకున్నారు. లలిత చనిపోయింది. అయితే దివ్య ఉరేసుకున్న చీర చినిగిపోవడంతో కింద పడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తల్లి, మేనల్లుడి మృతదేహాలను చూసి షాకైన శ్రీకర్.. బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.