Tamilnadu Tragedy | తమిళనాడులో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. మరో 11 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల మృతికి విషాహారం తినడమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత చిన్నారులంతా తిరుప్పూర్లోని వివేకానంద సేవాలయానికి చెందిన వారుగా తెలుస్తున్నది.
తిరుప్పూర్లోని వివేకానంద సేవాలయంలో ఉండే చిన్నారులు బుధవారం ఉదయం నిర్వాహకులు ఇచ్చిన ఇడ్లీ, పొంగల్ తిన్న తర్వాత వాంతులు చేసుకున్నారు. వారికి అక్కడే కొన్ని మందులు ఇచ్చి ప్రథమ చికిత్స చేశారు. వీరంతా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అయితే, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వారిని సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే, అంతకుముందు పరిస్థితి విషమించి ఇద్దరు చనిపోయారు. మరో చిన్నారి దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం 11 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వీరంతా 10-14 ఏండ్ల మధ్య వయస్సు వారే.
చిన్నారులు అస్వస్థతకు గురై చనిపోవడంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చిన్నారుల విస్రా శాంపిల్స్ శాస్త్రీయ పరీక్షకు పంపినట్లు పోలీస్ కమిషనర్ ఎస్ ప్రభాకరన్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు. దవాఖానలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు.