న్యూఢిల్లీ: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబం నిరాకరించడంతో ఒక యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ పర్బత్ ప్రాంతంలో నివాసం ఉండే 24 ఏళ్ల గౌరవ్ మిశ్రా, సెల్ ఫోన్ చార్జర్ల తయారీ యూనిట్ను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి 11 గంటలకు అతడి తండ్రి పోలీసులకు ఫోన్ చేశాడు. తన కుమారుడ్ని ఎవరో కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతంలో బంధించారని ఫిర్యాదు చేశాడు.
స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారంతో ఆనంద్ విహార్ బస్టాండ్ వద్ద గౌరవ్ మిశ్రా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లగా అతడి మొబైల్ ఫోన్ ఆఫ్లో ఉంది. దీంతో పోలీసులు అతడి తయారీ యూనిట్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే అతడు ఒంటరిగా రోహ్తక్ రోడ్ వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు గమనించారు. ఆ తర్వాత గౌరవ్ మిశ్రా తన ఫోన్ను ఆన్ చేయగా అతడు ఆనంద్ పర్బత్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, పోలీసుల దర్యాప్తులో అసలు విషయాన్ని గౌరవ్ మిశ్రా బయటపెట్టాడు. స్థానికంగా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించినట్లు తెలిపాడు. అయితే ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదన్నాడు. దీంతో పేరెంట్స్ను ఒప్పించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులకు చెప్పాడు. అయితే తప్పుడు ఫిర్యాదు నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.