చెన్నై : రేవ్ పార్టీలో పాల్గొన్న టెకీ(23) మరుసటి రోజు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది. డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే యువకుడు మరణించాడని భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తుండగా మృతుడిని నగరంలోని మడిపక్కానికి చెందిన టెక్ ప్రొఫెషనల్ ఎస్ ప్రవీణ్గా గుర్తించారు.
గ్రేట్ ఇండియన్ గ్యాదరింగ్ అనే కంపెనీ శనివారం అన్నానగర్లోని వీఆర్ మాల్లో జరిగిన రేవ్ పార్టీకి ప్రవీణ్ హాజరయ్యాడు. డీజే మంద్రగొర ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. పార్టీకి హాజరైన ప్రవీణ్ ఆపై స్ప్రహ కోల్పోవడంతో పోలీసులకు సమాచారం అందింది. రాత్రి పది గంటల ప్రాంతంలో రేవ్ పార్టీపై పోలీసులు దాడులు జరపగా అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది.
మైనర్ బాలురకు కూడా మద్యం సరరా చేస్తున్నట్టు గుర్తించారు. మాల్లో మద్యం సరఫరా చేసేందుకు నిర్వాహకులు మరో బార్ లైసెన్స్ను ఉపయోగించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్ధలం నుంచి 884 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.