లక్నో: రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్లో ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. 20 ఏండ్ల వివాహిత అహ్మదాబాద్ వెళ్లేందుకు భర్తతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చింది. అయితే రైలు రావడానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె భర్త పండ్లు కొనేందుకు రైల్వే స్టేషన్ బయటకు వెళ్లాడు. కాగా, టాయిలెట్ కోసం ఆ యువతి స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ వద్దకు వెళ్లింది. అయితే జనం ఉండటంతో టికెట్ కౌంటర్ వద్దకు వచ్చి వేచి ఉన్నది.
ఇంతలో ఒక వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. టాయిలెట్ కోసం చూస్తున్నట్లు ఆమె చెప్పింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను పబ్లిక్ టాయిలెట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ మహిళకు ఒక తాళం ఇచ్చి టాయిలెట్ను వినియోగించుకోమని చెప్పాడు. ఆమె టాయిలెట్ డోర్ తీయగానే లోపలికి చొరబడిన ఆ వ్యక్తి డోర్ లాక్ చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.