వెంగళరావునగర్, సెప్టెంబర్ 5 : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి బ్యాగు నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నాగనబోయిన సాంబశివరావు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల ఉండడంతో తన 20 తులాల బంగారు ఆభరణాలను గతంలో తన స్వగ్రామంలోని ఇండియన్ బ్యాంకులో తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి విడిపించుకునేందుకు గత నెల 23వ తేదీన పామర్రుకు వెళ్లాడు. బ్యాంకు నుంచి నగలు విడిపించుకుని 24వ తేదీన సాయి శ్రీనివాస ట్రావెల్స్కు చెందిన బస్సులో నగరానికి బయలుదేరాడు.
ఆభరణాలున్న బ్యాగును తన సీటు కింద పెట్టుకుని ప్రయాణించాడు. 25వ తేదీన ఉదయం ఎస్.ఆర్.నగర్ లో బస్సు దిగి బ్యాగు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బ్యాగును తెరిచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు.
దీంతో బాధితుడు తిరిగి పామర్రకు వెళ్లి వెదికాడు. నగల దొరకకపోవడంతో ఆదివారం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.