శివ్వంపేట(మెదక్) : ఇసుక దిబ్బ కూలి ప్రమాదవాత్తూ ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు గత కొద్ది రోజులుగా దొంగ తనంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని దుబ్బలమాకు వద్ద ఇసుకను ట్రాక్టర్లో నింపేందుకు కూలీలు అశోక్(27), మహేశ్(21)ను తీసుకెళ్లాడు. ఇసుక తీస్తున్న క్రమంలో ఇసుక దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని జెసిబి సహాయంతో కూలీల మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులు అందించిన సమాచారంతో శివ్వంపేట ఎస్ఐ రవికాంత్ రావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతుడు అశోక్కు భార్య, కుమారుడు(3) ఉన్నారు. మహేష్కు ఇంకా పెళ్లి కాలేదని గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.