ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బలూచ్ ప్రావిన్స్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షంలో వేగంగా వెళ్లడంతోనే అదుపు తప్పి బస్సు లోయలో పడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న సమయంలో జోబ్ వద్ద లోయలో పడిపోయింది.
బస్సు క్వెట్టా సమీపంలోకి రాగానే.. మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయిందని, ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ మెహతాబ్ షా తెలిపారు. వర్షానికి తోడు అతివేగమే కారణమని స్థానిక వార్తాపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.