కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డను లాలిస్తూ ఎంతో మురిసిపోయారు. చందమామ కథలు చెబుతూ.. ఆమె భవిష్యత్ను కలగంటూ.. ఆ పసిపాపను మురిపించారు. ఆ పసికందు నవ్వులకు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ నిద్రపుచ్చారు. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.. నిమిషాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. నిద్రలోకి జారుకున్న బిడ్డను ఓ విషపూరిత పాము కాటేసింది. అప్పటి వరకు ముద్దులతో, మురిపెంతో ఆడించిన బిడ్డను పాము కాటేసిందని తెలుసుకొని.. తల్లిదండ్రలు విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భాగ్యనగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆసిఫాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఏల్పుల రమేశ్ కథనం ప్రకారం.. 16 నెలల పసిపాప రియా తన తల్లి పక్కనే నిద్రిస్తుంది. తండ్రి కూడా అక్కడే నిద్రించాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రియాను విషపూరితమైన పాము కాటేసింది. దీంతో ఆ బిడ్డ గట్టిగా ఏడ్వడంతో తండ్రికి మెలకువ వచ్చింది. అక్కడే ఉన్న పామును తండ్రి గమనించి, దాన్ని చంపేశాడు. ప్రాణప్రాయ స్థితిలో ఉన్న బిడ్డను తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే పసికందు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు బోరుమన్నారు. పాప తండ్రి గణేశ్ దినసరి కూలీ.