పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తున్నాయి. తాజాగా చండీగఢ్లోని సంగ్రూర్ పోలీసులు ఇలా అక్రమంగా అమ్ముతున్న పెట్రోల్ను స్వాధీనం చేసుకున్నారు.
వీరికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 వేల లీటర్ల పెట్రోల్ దొరకడం గమనార్హం. దీంతోపాటు మరో 4 వేల లీటర్ల మిక్స్డ్ ఇంధనం, 3 వేల లీటర్ల ఇథనాల్, మూడు ఆయిల్ ట్యాంకర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్నిరోజుల ముందు ఇదే ప్రాంతంలో కొన్ని ఆయిల్ డిపోల సమీపంలో ఇలాగే అక్రమంగా పెట్రోల్ విక్రయిస్తూ కొందరు పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి 8050 లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే మరో 18 వేల లీటర్ల అక్రమ పెట్రోలియం ఉత్పత్తులు లభించడం గమనార్హం. ఈ కేసులో విక్రమ్ సింగ్, గుర్నామ్ సింగ్, కమ్మోమజ్రా ఖుర్ద్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. వీరిపై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.