సూర్యాపేట : భూమి విక్రయించగా వచ్చిన నగదును ఇంట్లో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన సంఘటన మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య చిన్నకారు రైతు. తనకి ఉన్న రెండు ఎకరాలను సేద్యం చేస్తూ గ్రామంలో కూలినాలి పనులకు వెళ్తూ ఉంటాడు.
కాగా, తన తండ్రి కి చెందిన ఉమ్మడి ఆస్తిని విక్రయించగా గత నాలుగు రోజుల క్రితం వచ్చిన పది లక్షల రూపాయలను ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. రోజు మాదిరిగా తన వ్యవసాయ పొలానికి పనులు నిర్వహించేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయంత్రం వేళ గెడిసెకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి.
చుట్టుపక్కల వారు గుర్తించి లక్ష్మయకి సమాచారం అందించి మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. బీరువాలో దాచిన నగదు సైతం అగ్నికి ఆహుతయ్యాయి.