రూ.8కోట్ల వ్యయంతో నిర్మాణం
ప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్రెడ్డి
సీఎం, ఎమ్మెల్యే షిండేకు ప్రజల కృతజ్ఞతలు
బిచ్కుంద, జూన్ 30: బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై పెద్ద దేవాడ వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.ఎనిమిది కోట్ల నిధులతో వంతెనను నిర్మించారు. వంతెనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. పెద్దదేవాడ వద్ద నిజాంకాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చివేశారు. దీంతో మండల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రజలు వాగులో నుంచి నీళ్లలో నడుచుకుంటే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం వెంటనే రూ.8కోట్ల నిధులను విడుదల చేశారు. పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. వంతెన నిర్మించి తమ కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వంతెనను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం తెలిపారు.