చండీఘఢ్ : హర్యానాలో దారుణ ఉదంతం వెలుగుచూసింది. భర్తకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై స్పృహ కోల్పోగానే ఊపిరిఆడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించిన మహిళ వ్యవహారం బయటపడింది. జనవరి 17 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులతో కలిసి మహిళ తన భర్తకు ఆహారంలో మత్తుపదార్ధాలు కలిపి ఇచ్చింది. 20 నిమిషాల పాటు భర్తను తీవ్రంగా హింసించింది. ఊపిరి ఆడకుండా చేసి ఉసురుతీయాలని ప్రయత్నించింది. బాధితుడు స్పృహ కోల్పోవడంతో మరణించాడనుకుని ఇంట్లో ఉన్న బంగారం, నగదు, విలువైన వస్తువులను లూటీ చేసి అక్కడి నుంచి ఉడాయించింది.
బాధితుడు (45) ఉదయాన్నే మెలకువ రావడంతో ఒంటినిండా గాయాలై ఉన్నాయి. భార్య కోసం వెతికితే ఎక్కడా కనిపించకపోవడంతో రాత్రి జరిగిన అరాచకం గుర్తుతెచ్చుకున్నాడు. మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మహిళతో పాటు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.