న్యూఢిల్లీ : ఢిల్లీ కంటోన్మెంట్లో 9 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. దళిత వర్గానికి చెందినందునే బాలికపై ఈ ఘోరానికి పాల్పడ్డామని నలుగురు నిందితుల్లో ఇద్దరు ఓ సాధువు, ప్యాక్టరీలో పనిచేసే కార్మికుడు నేరాన్ని అంగీకరించారని ఢిల్లీ పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన దళిత బాలిక హత్యాచార ఉదంతంలో బాధితురాలి కుటుంబసభ్యుల ఆమోదం లేకుండానే నిందితుడు బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు.
నిందితుడు ఈ ఘటనపై తమకు సమాచారం ఇచ్చాడని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడాన్ని చార్జిషీట్లో పొందుపరిచారు. చార్జిషీట్ ప్రకారం సాధువు రాధే శ్యాం, కుల్దీప్ బాలిక మృతదేహాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకువెళ్లడం చూశామని ఇద్దరు సాక్షులు తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశామని నలుగురు నిందితులు చెబుతూ తనను సాయం కోరారని సాక్షుల్లో ఒకరు స్టేట్మెంట్ ఇచ్చినట్టు చార్జ్షీట్లో ఢిల్లీ పోలీసులు ప్రస్తావించారు.