Womens World Cup | ఎన్నో ఏళ్ల కల..పలుమార్లు ఫైనల్ చేరినప్పటికీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకి 2025 వరల్డ్ కప్ని ఉమెన్ ఇన్ బ్లూ ముద్దాడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమకి సంబంధించి చిరంజీవి, ఎన్టీఆర్, ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ, వెంకటేష్,రాజమౌళి, కియారా అద్వాని, త్రిప్తి డిమ్రి, అడివి శేష్ ఇలా పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా… వరల్డ్ కప్ ఫైనల్లో సంచలన విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకి అభినందనలు. ఇది కలలు కనే ప్రతి యువతి విజయం, వారిని నమ్మిన తల్లిదండ్రులు, ఉత్సాహపరిచిన ప్రతి అభిమాని విజయం. ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించాలని చిరు ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్..ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచినందుకు భారత మహిళల జట్టుకి అభినందనలు. ఎంతో ధైర్యంగా పోరాడారు. ఉత్సాహంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయులంతా మీకు సలాం చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
దీప్తి ఆల్రౌండ్ ప్రతిభ, షెఫాలి సూపర్ ఇన్నింగ్స్తో భారత్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు భారతీయుల హృదయం గర్వంతో ఉప్పొంగుతుందని రాజమౌళి అన్నారు. ఇక విక్టరీ వెంకటేష్..ఈ కిరీటాన్ని పొందడానికి మన మహరాణులు నిజంగా అర్హులు. ఇవి చాలా రేర్ మూమెంట్స్. ఈ విజయం కోసం టీమిండియా ఎంతో శ్రమించింది.భారత క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన రోజు అని వెంకీ అన్నారు. విజయాన్ని ఎలా అందుకోవాలో టీమిండియా చేసి చూపించింది అని త్రిప్తి డిమ్రీ పేర్కొంది. మన ఛాంపియన్స్కి అభినందనుల అంటూ ప్రియాంక చోప్రా, ఇది ఒక చిర్మసరణీయమైన విజయం అని అనుష్క శర్మ, చరిత్ర సృష్టించారు, ఇవి మరిచిపోలేని క్షణాలు అని కియారా అద్వాని పేర్కొన్నారు.