బంజారాహిల్స్, ఏప్రిల్ 28: కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం తరఫున ప్రతియేటా నిర్వహించే రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని బోళానగర్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలందరికీ పండుగ ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం కానుకలను అందిస్తున్నదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని మేయర్ సూచించారు. అనంతరం శ్రీరాంనగర్లో కూడా కానుకలను పంపిణీ చేశారు.
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 28 : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నామని బన్సీలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత అన్నారు. డివిజన్ పరిధిలోని ముస్లిం బస్తీల్లో నివసించే పేదలకు బుధవారం సాయంత్రం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తున్నామన్నారు. పేద ముస్లింలకు ప్రభుత్వం కానుకలివ్వడం, రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి కూడా కరోనా ఉండటంతో ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కుర్మ లక్ష్మీపతి, ముకర్రమ్, అబ్బాస్, సల్మాన్, వెంకటేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.