ఇల్లంతకుంట, మే 25: అడిషనల్ కలెక్టర్ అం జయ్య మరణించడం బాధాకరమని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన జిల్లాలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి బాధితులకు అండగా ఉన్నారని కొనియాడారు. జిల్లా మంచి అధికారిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నామని పేర్కొన్నారు.
కలెక్టరేట్, మే 25: అదనపు కలెక్టర్ అంజయ్య అకాల మృతిపై ఆర్డీవో శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య మృతిపై సీపీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అంజయ్య మరణం జిల్లా ప్రజలకు తీరని లోటని, జిల్లాకు ఉత్తమ సేవతందించిన అతడికి సీపీఎం పక్షాన జోహార్లు అర్పిస్తున్నామన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 25: అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు రెవెన్యూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తహసీల్దార్ శ్రీకాంత్, డీటీ జయంత్కుమార్, ఆర్ఐ నవీన్కుమార్, సిబ్బంది ఉన్నారు.
బోయినపల్లి, మే 25: తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు మంగళవారం కార్యాలయం ఎదుట అదనపు కలెక్టర్ అంజయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన మృతి తీరని లోటని కొనియాడారు. తహసీల్దార్ యుగంధర్, నాయబ్ తహసీల్దార్ నవీన్ తదితరులున్నారు.