చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, రామ్చరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…‘వాల్తేరు వీరయ్య సినిమా విజయం సాధిస్తుందని ఆశించాం గానీ నాన్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల స్థాయికి వెళ్తుందని ఊహించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఇంతకంటే తెలుగు సినిమాకు గర్వకారణం ఏముంటుంది. నేనే చరణ్ స్థానంలో ఉన్నంత సంతోషంగా అనిపిస్తున్నది’ అని చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ…‘చిరంజీవి కుటుంబంతో మాకు 30 ఏండ్ల అనుబంధం ఉంది. వరంగల్లో స్టూడియో ఏర్పాటు చేయాలని చిరంజీవి, రామ్చరణ్ను కోరుతున్నా. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తా’ అన్నారు. హీరో రామ్చరణ్ మాట్లాడుతూ…‘నాన్న చాలా సౌమ్యంగా ఉంటారు గానీ ఆయన గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఇతరులకు తెలియదు. చిరంజీవి గారు మౌనంగా ఉంటారేమో గానీ ఆయన వెనకున్న మేము మౌనంగా ఉండం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, దర్శకుడు బాబీ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.