తెలంగాణ నేపథ్యంతో మరిన్ని చిత్రాలు చేస్తామని అన్నారు దగ్గుబాటి రానా. ఆయన హీరోగా నటించిన ’విరాటపర్వం’ సినిమా ఆత్మీయ వేడుక వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎబ్రెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…గతంలో సినిమా ప్రచార కార్యక్రమాలు విజయవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్ లో జరుగుతుండేవి. ఇవాళ వరంగల్ లో ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. పేరు చెబితే ఉత్సాహం వచ్చే ప్రాంతం వరంగల్. దర్శకుడు వేణు వరంగల్ బిడ్డ. వాళ్ల నాన్న సర్పంచ్ గా పనిచేశాడు. వరంగల్ లో మరిన్ని కార్యక్రమాలు, సినిమా ప్రారంభోత్సవాలు చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాత మిత్రులను కోరుతున్నా. ఇక్కడ రామప్ప, ములుగు, పాకాల చెరువు, వేయి స్తంభాల గుడి వంటి పర్యాటక ప్రదేశాల్లో షూటింగ్ చేసుకోవాలని కోరుతున్నా. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రభుత్వం తరుపున మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విరాటపర్వం సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు. రానా మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమ ఎదగాలన్నా, వైవిధ్యంగా మారాలన్నా ప్రతి ప్రాంతం కథ, ప్రతి ఊరి కథ తెరకెక్కించాలి.
అలా వరంగల్ కథను ఈ సినిమాలో రూపొందించాం. ఇకపైనా మరిన్ని తెలంగాణ నేపథ్య కథలతో చిత్రాలు చేస్తాం. నటుడిగా ఈ సినిమా నాకు గర్వకారణం. ఇప్పటిదాకా నేను నటించిన ప్రతి సినిమా కథ నన్ను మార్చేసింది. ఈ చిత్రంలో రవన్న పాత్ర ప్రభావం కూడా నాపై చాలా ఉంది. యాక్షన్ సినిమాలు చేస్తే ఈలలు వేస్తారు. కానీ ఇది మన మనసును తాకే సినిమా. అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ…నేను ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు తమ సోదరిగా, కూతురిగా పోల్చుతూ చెబుతుంటారు. వాళ్ల రుణం నేను తీర్చుకోవాలంటే ఇలాంటి మన ఊరి కథల్లోనే నటించాలి. ఈ సినిమా మన వరంగల్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించింది. హాలీవుడ్ లో కూడా వాళ్ల స్థానిక కథలనే చూపిస్తారు. మనమూ ఈ చిత్రంతో ఆ ప్రయత్నం చేశాం. అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ…ఎక్కడ అపజయాలు కూడా అగ్ని జ్వాలలై మండుతాయో, ఎక్కడ మరణాలు కూడా మహా కావ్యాలుగా పుడతాయో ఆ ప్రాంతమే వరంగల్. కళ, వ్యాపారం రెండింటి గురించి తెలిసిన హీరో రానా. ఇవాళ ఓటీటీలు వచ్చాక కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. మనం నమ్మిన కథను నిజాయితీగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా మీద నాకూ అదే విశ్వాసం ఉంది. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత సుధాకర్ చెరుకూరి, నటుడు నవీన్ చంద్ర, ప్రియమణి తదితరులు పాల్గొన్నారు.