Vijay | దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన శక్తుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, అన్నాడీఎంకే మరియు తమిళగ వెట్రి కళగం మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ కీలక ప్రకటనలు చేశారు. చెన్నైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తాను రెండు నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనల కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ఆయన తీసుకున్న ఒక ప్రత్యేక నిర్ణయం.
గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్కు కృతజ్ఞతగా, ఆయన కుమారుడు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్ను అభ్యర్థిగా ప్రకటించారు. వేదికపై ఈ ప్రకటన చేయగానే రాజేంద్రన్, శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ను హత్తుకుని, ఆయన పాదాలపై పడుతూ తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, “మా పార్టీ సామాన్య ప్రజలకు అవకాశం ఇస్తుంది. వారసత్వ రాజకీయాలకు, డబ్బు ఆధారిత రాజకీయాలకు మా వద్ద స్థానం లేదు. చదువుకున్న యువతకు పెద్దపీట వేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన నాయకత్వ శైలిని ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలు కూడా “లీడర్ అంటే ఇలా ఉండాలి” అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే ఎలా ప్రభావం చూపుతుందో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
#ThalapathyVijay has given an MLA seat to his personal car driver Rajendran’s son, Sabrinathan.
pic.twitter.com/4mQPkMUtrV— Movies Singapore (@MoviesSingapore) March 29, 2026