‘ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పి వారిలో అవగాహన కలిగించాలి’ అన్నారు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్. ఆదివారం చెన్నైలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను ఆయన అభిమాన సంఘం తరపున సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన విజయ్ నేటి రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేటి విద్యార్థులే భవిష్యత్తులో ఓటర్లని, రాజకీయాలపై వారు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ‘డబ్బులిచ్చిన వారికే కొందరు ఓట్లు వేస్తున్నారు.
ఒక నియోజక వర్గానికి 15కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని తెలిసింది. అంత డబ్బు పెడుతున్నారంటే అవినీతి ద్వారా వాళ్లు ఎంత సంపాదించి ఉంటారో అర్థం చేసుకోవాలి. నేటి సోషల్మీడియా యుగంలో ఫేక్న్యూస్లు ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తున్నాయి. వాటి వెనక రహస్య అజెండాలుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్, పెరియార్ వంటి గొప్ప వ్యక్తుల పుస్తకాలను చదవాలి’ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు విజయ్ నగదు ప్రోత్సాహకాల్ని అందించారు.