‘ఓ తల్లి తన కొడుకు ఛాంపియన్గా నిలవాలని, భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై రెపరెపలాడించాలని కలలు కనే కథాంశంతో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి సినిమాను బాయ్కాట్ చేయాలని అంటారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ‘లైగర్’ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందిస్తూ “బాయ్కాట్ చేయాలని అడుగుతున్న వారి గొడవ ఏమిటో నాకు తెలియదు. మేము ఈ సినిమా ప్రచారం కోసం దేశంలో ఏ నగరానికి వెళ్లినా ప్రజలు ఎంతో ప్రేమ కనబరుస్తున్నారు.
ఆ జనాల కోసమే మేము సినిమా చేశాం. వారి ప్రేమ ఉన్నంత వరకు నేను ఎవరికీ భయపడను. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదీ ఎదురొచ్చినా కొట్లాడుడే. మూడేళ్ల శ్రమ ఫలితమే ఈ సినిమా. మేమంతా భారతీయులం. దేశాన్ని గొప్పగా ప్రేమిస్తాం. కంప్యూటర్ల ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్ కాదు మాది. ఈ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగగానే యాభై మంది బైక్లతో నాకు స్వాగతం పలికారు. వారంతా కరోనా టైమ్లో నేను మొదలుపెట్టిన కరోనా మిడిల్క్లాస్ ఫండ్కు విరాళాలు ఇచ్చిన వారే. ఆ విరాళాలతో నేను ప్రజల్ని ఆదుకోగలిగాను. దేశాన్ని ముందుకు నడపడానికి అలాంటి యువకులు మనకు కావాలి కానీ ఎదుగుతుంటే క్రిందికి లాగేవాళ్లు ఎందుకు?’ అని ప్రశ్నించారు.