“ఖుషి’ సినిమా మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇందుకోసం డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ దాటుకొని అభిమానుల ప్రేమవల్లే ఈ విజయాన్ని అందుకున్నా. నా అభిమానుల ముఖాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా. ‘ఖుషి’ సంపాదన నుంచి కోటి రూపాయలను నా ఫ్యాన్స్కు అందించబోతున్నా. అభిమానుల్లో వంద కుటుంబాలను ఎంపిక చేసి వారందరికి లక్ష రూపాయల చెక్ను అందించబోతున్నా’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఖుషి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా సోమవారం విశాఖపట్నంలో బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ను నిర్వహించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నాపై జరుగుతున్న కుట్రల గురించి తర్వాత మాట్లాడుతా. ప్రస్తుతం ‘ఖుషి’ విజయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. మీరంతా దేవర ఫ్యామిలీ. నేను అందించే డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడినా నాకు సంతోషమే. ఇప్పటి నుంచి నా అభిమానుల ఆనందం కోసం పాటుపడతా’ అన్నారు. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించామని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘మా సంస్థకు మెమొరబుల్ హిట్ ఇది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధిస్తుందనుకుంటున్నాం’ అన్నారు.