Vijay | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకున్న ఓ వినూత్న కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు నాడే జన్మించిన నవజాత శిశువులకు బంగారు ఉంగరాలను బహూకరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జూన్ 22 ముఖ్యమంత్రి విజయ్ జన్మదినం రోజున తూత్తుకుడి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మొత్తం ఆరుగురు శిశువులు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని తల్లులు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆరుగురు నవజాత శిశువులకు ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఉంగరాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంది. తమ పిల్లలు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు నాడే జన్మించడం, అదే సమయంలో ప్రభుత్వ మంత్రి చేతుల మీదుగా బంగారు కానుక అందుకోవడం పట్ల ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో అభిమానులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
దళపతి విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తూత్తుకుడిలో నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు అందజేసిన ఈ కార్యక్రమం మాత్రం విజయ్ అభిమానుల ప్రత్యేకమైన అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VIDEO | Tamil Nadu: As part of state-wide celebrations for Chief Minister C Joseph Vijay’s 52nd birthday, TVK leader and Minister Srinath visited the Thoothukudi Government Hospital on Monday.
On behalf of the ruling Tamilaga Vettri Kazhagam (TVK), the minister presented gold… pic.twitter.com/kk6cJgbrSA
— Press Trust of India (@PTI_News) June 22, 2026