నాయిక ప్రధాన చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయిక విద్యా బాలన్. ఆమె నటించిన ‘కహానీ’, ‘శకుంతలా దేవి’, ‘షేర్ని’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నటనకు అవకాశమున్న విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ తనకుంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుందీ నాయిక. అయితే ఇలా కొత్త తరహా చిత్రాల్లో నటించడం తమపై అంచనాలు పెంచుతున్నదని విద్యా బాలన్ అంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…‘నా కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతుంటాయి. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ వైవిధ్యమైన చిత్రాల్లో నటించడమే ఇందుకు కారణం. అయితే నేను ఏ తరహా సినిమాలు చేస్తూ కొనసాగాలి అనే స్పష్టత ఇప్పటికీ నాకు లేదు. మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటూ వెళ్తున్నాను.
పరిశ్రమలోని వారు నాపై ఒక ముద్ర వేసి నన్నొక ఇమేజ్ ఛట్రంలో బంధించాలని చూస్తుంటారు. హీరోల సినిమాలు నాయికల చిత్రాల కంటే పైచేయి సాధించడం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరు హీరో అనేది కాకుండా కంటెంట్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని చెప్పింది. ఇటీవల ఓటీటీలో ‘జల్సా’ అనే చిత్రంలో కనిపించిన విద్యా బాలన్…‘నీయత్’ అనే చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నది.