Vidya Balan | బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది విద్యాబాలన్. వుమెన్ బేస్డ్ సినిమాలు తీయడానికి దర్శకులు భయపడున్న సమయంలో.. చిత్రాలను తన భుజాలపై వేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసింది. ఇందుకు ఉదాహారణ డర్టీ పిక్చర్, శకుంతలా దేవి, జల్సా, షెర్నీ చిత్రాలే. ఆయా చిత్రాల్లో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నది. 43 సంవత్సరాల వయసులోనూ సినిమాలు చేస్తూ.. తన అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలతో అప్పుడప్పుడు అభిమానులను పలుకరిస్తుంటుంది. ఇటీవల అభిమానులతో ఆన్లైన్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరిట సెషన్లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినీ పరిశ్రమలో లింగ వివక్ష, రెమ్యూనరేషన్లో వృత్యాసంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏ విషయమైనా ఫిల్టర్ చేయకుండా చెప్పేస్తానని చెప్పింది. సమాజంలో కొనసాగుతున్న మూస పద్ధతులను బద్దలు కొట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలకు ఎందుకు తక్కువ వేతనం ఇస్తున్నారని విద్యాబాలన్ ప్రశ్నించింది.
ఇందుకు కూడా సమాధానం కావాలని (ఈస్ సవాల్ కా జవాబ్ ముఝే భీ చాహియే) డిమాండ్ చేసింది. మహిళలు వివాహానంతరం ఉద్యోగం చేసేది సమాజ మేలు కోసమేనని, ఇది భవిష్యత్ తరాల అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్ ఇంటి పనిలో తనకు ఎలా సహాయపడుతారో వివరించింది. ‘మనం ఒక్కసారే జీవించి ఒక్కసారే మరణిస్తాం. కాబట్టి ఏ పనినైనా ఇప్పుడు చేయలేకపోతే ఎప్పటికీ చేయలేం’ అని పేర్కొంది. వీటితో పాటు మహిళలు తమ పని ప్రాంతంలో ‘విషయాలతో’ ఎలా వ్యవహరించాలనే దానిపై విద్యాబాలన్ స్పందించారు. గృహిణిగా ఉండడంలో తప్పేమీ లేదని నొక్కి విద్యాబాలన్.. ‘గృహిణిగా ఉండడం, బిడ్డను పెంచడం కూడా స్త్రీకి మంచి అనుభూతిని కలిగిస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది’ అని చెప్పింది. 43 ఏళ్ల ఆమె ఇటీవల తన రాబోయే చిత్రం నీయత్ షెడ్యూల్ ముగించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చింది. మరోవైపు, ఆమె కొన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుపుతోంది.