తిరువనంతపురం: సినిమా, నాటక రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు పీసీ సోమన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున మరణించారు.
కేరళకు చెందిన పీసీ సోమన్ నాటక రంగంలో అద్భుతమైన నటనా ప్రదర్శన ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ మలయాళీ దర్శకుడైన అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు.
అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో స్వయం వరం, విధేయన్, మతిలుకల్ లాంటి సూపర్హిట్ చిత్రాల్లో పీసీ సోమన్ నటించారు. కౌరవార్, ధృవం, ఫైర్ మ్యాన్ లాంటి చిత్రాలు సోమన్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
పీసీ సోమన్ మొత్తం 300 లకు పైగా చిత్రాల్లో నటించారు. తన సుదీర్ఘ నటనా జీవితంలో సోమన్ టెలివిజన్ రంగంలో కూడా తనదైన ముద్ర కనబర్చారు. కాగా, పీసీ సోమన్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.