అగ్ర హీరో మహేశ్బాబు హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’కి చెందిన గ్లింప్స్ని మెక్సికోలో జరుగుతున్న ‘కామిక్కాన్ ఎక్స్పీరియన్స్ -2026’లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వీడియో ద్వారా అక్కడి ప్రేక్షకులకు రాజమౌళి సందేశాన్నందించారు. ‘తెరపై ఓ అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించడమంటే నాకిష్టం. ‘బాహుబలి’లోని మాహిష్మతి నిర్మాణానికి మెక్సికోలోని ఓ నగరం నాకు స్ఫూర్తి. మేథాసంపత్తి కలిగిన మీలాంటి వ్యక్తుల ద్వారానే అలాంటి నగరాల గురించి తెలుసుకోగలిగాను. మనసుల్ని తాకే భావోద్వేగాలు కథలో ఉంటే, ఆ కథ ఏ దేశ ప్రజల్లోకైనా తేలిగ్గా వెళ్లిపోతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న ‘వారణాసి’ సినిమాకు అదే ఫౌండేషన్.
పాతికేళ్లుగా సినిమాలు చేస్తున్నా. కష్టపడి తెరకెక్కించిన సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అలాంటి ఆనందాన్ని పొందాను. ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమంతా కాలు కదిపినప్పుడు.. ఆ మూమెంట్స్ చూసి ఉద్వేగానికి లోనయ్యాను. నేను సినిమాలు ఎందుకు తీస్తున్నానో నాకప్పుడర్థమైంది’ అంటూ ఎమోషనల్గా మాట్లాడారు రాజమౌళి. ఈ ఈవెంట్కి రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రదర్శించిన ‘వారణాసి’ గ్లింప్స్ని మీడియాకు విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఆ వీడియో బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకున్నది.