అగ్ర హీరో మహేశ్బాబు, దిగ్దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ చిత్రం దేశంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్లో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని భారీ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ని కాశీలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. నిజానికి ఈ సన్నివేశాలను హైదరాబాద్లోనే షూట్ చేయాలనుకున్నారాయన. గగన్పహాడ్ పరిసరాల్లో ఇందుకోసం ఓ భారీ కొలను కూడా నిర్మించారు.
దీనికోసం దాదాపు 150 ట్యాంకర్ల నీళ్లు అవసరం కావడంతో జలమండలికి నిర్మాతలు లేఖ రాశారు. వేసవి కావడం చేత అంత నీరు ఇవ్వలేమంటూ ప్రభుత్వం ‘వారణాసి’ యూనిట్కి షాకిచ్చింది. దాంతో షూటింగ్ని కాశీకి షిఫ్ట్ చేశారు రాజమౌళి. అక్కడి గంగానదిలోనే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సీక్వెన్స్ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం.
ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, ఎస్ఎస్ కాంచి, మాటలు: దేవ కట్టా, కెమెరా: పీఎస్ విందా, సంగీతం: ఎంఎం కీరవాణి, నిర్మాతలు: కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్.