తల్లీకూతుళ్ల అనుబంధమే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రానికి అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. వచ్చే నెల 3న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ చిత్రంలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా.. మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా..’ అంటూ సాగే ఈ పాటను రహమాన్ రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు.
అమృతా సురేశ్ ఆలపించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్లో కూడా ఈ పాటను విడుదల చేయడం విశేషం. వరలక్ష్మీ శరత్కుమార్, వివేక్ష మీద తెరకెక్కిన ఈ పాటను కొడైకొనాల్ కొండల్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. తల్లీకూతుళ్లిద్దరూ విహారయాత్రకు వెళ్లే సమయంలో వచ్చే పాట ఇదని విజువల్స్ చెబుతున్నాయి.
కథలో కీలక సందర్భంలో ఈ పాట వస్తుందని, భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇదని నిర్మాత తెలిపారు. గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపీ, సునయన తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ, నాగబాబు, కెమెరా: రాహుల్ శ్రీవత్సవ, నాని చమిడిశెట్టి.