Vaishnavi Chaitanya ‘కథానాయిక అవ్వాలనే కోరికతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ‘బేబీ’ సినిమా కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందనుకున్నా’ అని అన్నారు కథానాయిక వైష్ణవి చైతన్య. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించారు.
ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ “బేబీ’ చిత్రంలో బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయిగా కనిపిస్తాను. బస్తీ నుంచి బయటికి వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కథ. జీవితం నుంచి ఆమె ఏం నేర్చుకుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయి ప్రేమలో వుండే ఆ అమ్మాయి లైఫ్లోకి కాలేజీలో జాయిన్ అయ్యాక మరో అబ్బాయి వస్తాడు.
ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారిపోయింది? అన్నది ఆసక్తిని పంచుతుంది. షూటింగ్ తొలి రోజుల్లో సెట్లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ సాయిరాజేష్ గారు, మిగతా ఆర్టిస్టులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎటువంటి భయం లేకుండా నటించాను. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి సినిమా చేశాను. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అన్నారు.