Upasana Konidela | టాలీవుడ్ స్టార్ జంట రామ్చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా గతేడాది అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటి సారి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చరణ్తో కలిసి హాజరైన ఉపాసన.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ అవార్డు దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పుట్టబోయే బిడ్డ గురించి తొలిసారి రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది.
‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. దేశం గర్వంచదగిన సమయం ఇది. ఈ ప్రయాణంలో నేనూ భాగమయ్యేలా చేసిన చరణ్కు.. రాజమౌళికి ధన్యవాదాలు. నాతోపాటు.. నా బిడ్డ కూడా ఈ గౌరవం అనుభవించడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఉక్రెయిన్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మేకర్స్ కృషికి ఇది గెలుపు. ఉక్రెయిన్లో షూటింగ్ నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు మీరు నాకు చాలా నేర్పించారు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ వైరల్ అవుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును (Golden Globe Awards) దక్కించుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అమెరికాలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు.