ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో బాలీవుడ్ తార భూమి ఫెడ్నేకర్ భాగస్వామి కానున్నది. యూఎన్డీపీ చేపట్టిన స్ట్రాటజిక్ డెవలప్మెంట్ గోల్స్కు తొలి జాతీయ అడ్వకేట్గా ఆమె ఎంపికైంది. పేదరికం, పర్యావరణం, శాంతి మొదలైన అంశాల్లో ప్రజా జీవనం మెరుగుపడేలా ఈ కార్యక్రమం ముందుకు సాగనుంది. 2030 ఏడాదికి ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
యూఎన్డీపీ ఎస్డీజీఎస్కు ఇండియన్ అడ్వకేట్గా ఎంపికైన సందర్భంగా భూమి ఫెడ్నేకర్ మాట్లాడుతూ…‘ఐక్యరాజ్య సమితి నాకు అప్పగించిన ఈ బాధ్యతను గౌరవంగా భావిస్తున్నా. సమాజంలో మార్పు తీసుకొచ్చే పనిలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే భవిష్యత్ తరాలకు గొప్ప ప్రపంచాన్ని ఇవ్వగలమని నమ్ముతున్నా. ఈ కార్యక్రమం ద్వారా సమానత్వం, సుస్థిరత సాధించేందుకు ప్రయత్నిస్తాను. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష తొలగిపోవాలి’ అని చెప్పింది.