Shah Rukh Khan | పఠాన్ (Pathaan) మూవీతో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) మరోసారి ఫామ్లోకి వచ్చాడు. వివాదాల నడుమ విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. గతకొన్నేండ్లుగా సరైన హిట్ లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న షారూఖ్.. ఈ సినిమాతో బాలీవుడ్లో తన స్టమీనాను నిరూపించుకున్నాడు. అయితే ముంబైలోని (Mumbai) మన్నత్లో (Mannat) ఉన్న ఆయన నివాసంలోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు అక్రమంగా షారూఖ్ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణలో భాగంగా వారిద్దరు గుజరాత్కు (Gujarat) చెందినవారని తేలింది. తాము పఠాన్ స్టార్ (Pathaan Star) షారూఖ్ను కలవడానికి వచ్చామని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులిద్దరిపై వివిధ సెక్షన్లకింద కేసులు నమోదుచేశారు. అయితే యువకులు ఇంట్లోకి చొరబడినప్పుడు షారూఖ్ దంపతులు అక్కడ ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 36 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.528.06 కోట్లు నెట్ వసూలుచేసింది. ఇందులో రూ.18.22 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది.
అలాగే, రూ.1024.50 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.139 కోట్లతో అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది. ఇక తాజా వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో వెయ్యికోట్ల మైలురాయిని దాటిన ఐదో చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది. అంతకు ముందు దంగల్, బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు నమోదు చేశాయి.